లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రయాగ్రాజ్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ యూపీలో విద్యా, ఉపాధి రంగాలను యోగి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఎస్పీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని, 69,000 టీచర్ల నియామకాలు చేపడతామని మ్యానిఫెస్టోలో ఎస్పీ ప్రకటించిన హామీలను వివరించారు.
మహిళా టీచర్లకు వారి సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపడతామని అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఎమర్జెన్సీ నెంబర్ 100 కాస్తా 112గా మారిందని తాము ఈ వాహనాల సంఖ్యను రెట్టింపు చేస్తామని తెలిపారు. గిరిజనులకు ఎస్పీ ప్రభుత్వం సామాజికార్ధిక ప్రయోజనాలు చేకూరుస్తుందని అన్నారు. వారికి సమాజ్వాది ఫించన్ అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాషాయ పార్టీ ఛోటా నేతలు చిన్న చిన్న అబద్ధాలు చెబితే బడా నేతలు పెద్ద అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఈ అబద్దాలకోరులు మిమ్మల్ని ఓట్లు అడిగేందుకు మళ్లీ వచ్చారని ఎద్దేవా చేశారు. ఈసారి ప్రజల మద్దతు ఎస్పీకి లభిస్తుండగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం రాగానే బడా పారిశ్రామికవేత్తలు దేశం డబ్బును దిగమింగి విదేశాలకు పారిపోయారని, మరో పారిశ్రామికవేత్త 28 బ్యాంకుల నుంచి వేలాది కోట్లు దండుకుని పరారయ్యాడని అఖిలేష్ ఆరోపించారు. పేదలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఇబ్బందులు పెడుతుంటే మరోవైపు కొందరు నిరంతరం బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పరారవుతున్నారని అన్నారు. ఇక యూపీలో పిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. యూపీలో గెలుపుతో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకత ఆసరాగా అందంలం ఎక్కాలని అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటుగా సత్తా చాటాలని కాంగ్రెస్, బీఎస్పీలు పావులు కదుపుతున్నాయి.