లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో సోమవారం ప్రారంభించిన కాశీ విశ్వనాధ్ కారిడార్పై రాజకీయ దుమారం రేగింది. ఈ కారిడార్ను చేపట్టిన ఘనత కాషాయ పార్టీ తన ఖాతాలో వేసుకుంటోందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. యూపీలో ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలోనే కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని అఖిలేష్ పేర్కొన్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తమ ప్రభుత్వ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ లభించిందనేందుకు సంబంధిత పత్రాలే సాక్ష్యమని, ఇందుకు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్పీ హయాంలోనే చేపట్టిన ప్రాజెక్టులను యోగి సర్కార్ తమ ప్రాజెక్టులుగా ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. మరోవైపు మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. 2014 నుంచి హిందుత్వవాదులు అధికారంలో ఉన్నా హిందువులు అధికారానికి దూరంగా ఉన్నారని పాలక హిందుత్వవాదులు నకిలీ హిందువులని రాహుల్ వ్యాఖ్యానించారు.