ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం పట్ల ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ లోక్సభ సభ్యత్వ పునరుద్ధరణ పట్ల కాంగ్రెస్ పార్టీని, ఈ దిశగా ఉత్తర్వులు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్ధానానికి అభినందనలు తెలియచేస్తున్నానని అఖిలేష్ పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్ధల పట్ల విశ్వాసం ఇనుమడించిందని వ్యాఖ్యానించారు. మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేండ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఆగస్ట్ 4న నిలిపివేసిన నేపధ్యంలో కాంగ్రెస్ నేత లోక్సభ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ సోమవారం పునరుద్ధరించింది. ఈ ఏడాది మార్చిలో దిగువ సభ నుంచి అనర్హత వేటుకు గురైన రాహుల్ సుప్రీం కోర్టు ఉత్వర్వులతో వయనాద్ ఎంపీగా తిరిగి తన హోదాను నిలబెట్టుకున్నారు.
మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల్లో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయనపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు కాంగ్రెస్, విపక్ష నేతలు స్వాగతించారు.
Read More :