Lucknow | సమాజ్వాదీ పార్టీ మార్గదర్శకుడు, మాజీ సీఎం ములాయం యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. దీంతో యూపీ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఇదే విషయంలో ములాయం సింగ్ యాదవ్ వారించినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరే విషయంలో అపర్ణతో ములాయం వారించినట్లు సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఈ విషయంలో ములాయం చాలా సముదాయించారని అయినా, అపర్ణ వినలేదని, బీజేపీలో చేరిపోయారని అఖిలేశ్ పేర్కొన్నారు.
అయితే అపర్ణ బీజేపీలో చేరడంతో తనకెంతో సంతోషాన్నిచ్చిందని అఖిలేశ్ ప్రకటించారు. సమాజ్వాదీ సిద్ధాంతం మరింత విస్తృతమైందన్నారు. టిక్కెట్ దక్కనందువల్లే అపర్ణ బీజేపీలో చేరిపోయారా? అని ప్రశ్నించగా… టిక్కెట్ల పంపిణీ ఇంకా పూర్తే కాలేదు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొద్దు? అనేది ప్రజలపైనే ఆధారపడి ఉంటుది. అంతర్గత సర్వే కూడా చేయించుకుంటాం. తాము ఎవరికైతే టిక్కెట్లను నిరాకరిస్తామో, బీజేపీ వారికి టిక్కెట్లిస్తోంది. అని అఖిలేశ్ వివరించారు.
ములాయం సింగ్ కోడలు అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య, యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ ఇద్దరు నేతలూ ఆమెకు కండువా కప్పి, బీజేపీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా అపర్ణ యాదవ్ బీజేపీకి కృతజ్ఞతలు ప్రకటించారు. మోదీ పని తీరుపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అపర్ణ లక్నో కాంట్ అసెంబ్లీ టిక్కెట్ను ఆశిస్తున్నారు.