లక్నో : తనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ చేసిన వారసత్వ రాజకీయాల వ్యాఖ్యలను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తిప్పికొట్టారు. తనకు కుటుంబం ఉండటం పట్ల గర్విస్తున్నానని, కుటుంబాన్ని వదిలివేసి సంచీ తగిలించుకుని వెళ్లిపోయే వారం కాదని యోగిని ఉద్దేశించి అఖిలేష్ ఎద్దేవా చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో సీఎం యోగికి కుటుంబం ఉంటే వలస కూలీల కష్టాలు తెలిసేవని అన్నారు. స్వస్ధలాలకు చేరుకునేందుకు కూలీలు కాలినడకన ప్రయాణిస్తూ కష్టనష్టాలకు గురయిన విషయం గుర్తుచేశారు. యోగి సర్కార్ హయాంలో అవినీతి రాజ్యమేలుతోందని అఖిలేష్ ఆరోపించారు. లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడు అజయ్ మిశ్రాకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై అఖిలేష్ స్పందిస్తూ రైతుల మరణాలకు కాషాయ పార్టీయే బాధ్యత వహించాలని అన్నారు.
లఖింపూర్ ఖేరి ఘటనలో దోషులను శిక్షించడంలో యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బోగస్ ఓటింగ్ జరుగుతోందనే ఆరోపణలతో షమ్లి జిల్లాలో బీజేపీ, ఆర్జేడీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక కొన్ని పోలింగ్ బూత్ల్లో ఈవీఎంలు మొరాయించడంతో గందరగోళం నెలకొంది. ఈసీ అధికారులు సత్వరమే రంగంలోకి దిగి పనిచేయని ఈవీఎంల స్ధానంలో కొత్త ఈవీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో సాయంత్రం ఐదు గంటల వరకూ 57.79 శాతం పోలింగ్ నమోదైంది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం షమ్లి, ముజఫర్నగర్, భాగ్పట్, మీరట్, ఘజియాబాద్, హపూర్, గౌతం బుద్ధనగర్, బులంద్షహర్, అలీఘఢ్, మధురా, ఆగ్రా జిల్లాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ పావులు కదుపుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో కాంగ్రెస్ ఉనికిపాట్లు పడుతుండగా..దళితులు, అణగారిన వర్గాల ఆసరాతో ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇవ్వాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది.