Akhilesh yadav | సమాజ్వాదీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ ఇంటిపై ఐటీ దాడుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు బృందాలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. సమాజ్వాదీ నేతలపై ఐటీ దాడులు జరుగుతాయని తమకు ముందే తెలుసన్నారు. ద్వేషపూరిత ప్రసంగాలతో గాలిని విషపూరితం చేసే వారికి సౌహార్ద్రత సుగంధాలు నచ్చుతాయా? ఎలా రుచిస్తాయి? అంటూ అఖిలేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పీయూశ్ జైన్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని, ఆయనకు, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. కన్నౌజ్ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పెట్టింది పేరని, పెర్ఫ్యమ్ వ్యాపారం కూడా పెద్ద మొత్తంలో నడుస్తుందని, వీటితో ముడిపడి మరికొన్ని వ్యాపారాలు కూడా సాగుతాయని అన్నారు. అయితే ఇంత మంచి పేరున్న కన్నౌజ్ను బద్నాం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
పెర్ఫ్యూమ్ బిజినెస్తో లింక్ ఉన్న వారిని బీజేపీ సోషల్ మీడియా టీమ్ సరిగ్గా గుర్తించలేకపోయిందని, పీయూశ్ జైన్ ఇంట్లో ఐటీ దాడులు చేస్తే అసలు నిజం బయటపడిందని విమర్శించారు. ఈ దాడులతో తమపై బురదజల్లడానికి బీజేపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. హిట్లర్ కాలంలో తప్పుడు ప్రచారం చేయడానికే ప్రత్యేకంగా ఓ మంత్రి ఉండేవారని, ఇప్పుడు ఈ పార్టీయే తప్పుడు ప్రచారాల పార్టీ అని బీజేపీపై మండిపడ్డారు.