Akhilesh-Yogi |సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ప్రస్తావన తెచ్చిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్పై బీజేపీ విరుచుకుపడింది. అఖిలేశ్ యాదవ్ది తాలిబన్ మైండ్సెట్ అని ఉత్తరప్రదేశ్ సీఎంయోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మరో అడుగు ముందుకేసి అఖిలేశ్ అలీ జిన్నా అని పేర్కొన్నారు.
ఆదివారం హర్దోయిలో జరిగిన ప్రచారసభలో అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా పటేల్ను పొగడ్తల్లో ముంచెత్తారు.. దాంతోపాటు సర్దార్ పటేల్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నా ఒకే సంస్థలో న్యాయవాద పట్టా అందుకున్నారు. వారు న్యాయవాదులైన తర్వాత భారత్ స్వాతంత్య్రోద్యమం కోసం పోరాడారు. వారు తమ పోరాటం నుంచి వెనుదిరగలేదు అని అఖిలే్ వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరుగనుండగా అఖిలేశ్ యాదవ్ పాకిస్థాన్ వ్యవస్థాపకుడి ప్రస్తావన తేవడం రాజకీయ వివాదానికి దారి తీసింది. బీజేపీ నాయకత్వం మొదలు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరకు అఖిలేశ్ యాదవ్పై విమర్శలు గుప్పించారు.
సర్దార్ పటేల్తోపాటు జిన్నాను కీర్తించడంతో అఖిలేశ్ యాదవ్ది విభజన మనస్తత్వం అని మరోసారి రుజువైందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.ఇది విభజన వాదాన్ని విశ్వసించే తాలిబన్ మెంటాలిటీ.. దీనిపై ప్రజలకు అఖిలేశ్ క్షమాపణ చెప్పాలన్నారు.
యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ.. అఖిలేశ్ యాదవ్ను అఖిలేశ్ అలీ జిన్నా అని, ఆయన పార్టీ నవాజ్వాదీ పార్టీ అని ఎద్దేవా చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసం సర్దార్ పటేల్ను కించపరిచారన్నారు. అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ అఖిలేశ్ ప్రకటనలతో ఒక వర్గం ప్రజలు సంతోషించొచ్చు. కానీ ముందు అఖిలేశ్ యాదవ్ తన సలహాదారులను మార్చుకోవాలన్నారు.
దీనిపైన బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. తన మిత్రపక్షం బీజేపీతో విభేదించారు. ప్రస్తుతం వివాదాలు సృష్టిస్తున్నవారికి దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎటువంటి పాత్ర లేదన్నారు. దీనిపై చర్చించడానికి ఏమీ లేదన్నారు.