Sunetra Pawar | బారామతి లోక్సభా నియోజకవర్గం.. ఇప్పుడు దేశ ప్రజలంతా ఈ నియోజకవర్గంపైనే దృష్టిని కేంద్రీకరించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మరాఠా స్ట్రాంగ్ మ్యాన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరత్ చంద్ర పవార్) పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే నాలుగోసారి పోటీ చేస్తున్నారు.
సుప్రియాసూలే ప్రత్యర్థిగా ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఉండటమే దీనికి కారణం. బారామతిలో సునేత్ర పవార్ గెలుపు ఆమె భర్త అజిత్ పవార్కు ఎంతో ప్రతిష్టాత్మకం. ఎన్నికల్లో సునేత్ర పవార్ గెలిస్తే అజిత్ పవార్కు ఎంతో శుభవార్త అవుతుంది. ఆమె విజయం సాధిస్తారని అజిత్ పవార్ నమ్ముతున్నారు.
కానీ, ఇప్పటి వరకూ అజిత్ పవార్కు మద్దతుదారుగా ఉన్న కీలక నేత.. ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలోనే కొనసాగుతున్నప్పటికీ, బారామతిలో సునేత్ర పవార్ను ఓడించిన తర్వాతే పార్టీని వీడతానని ఆ నేత శపథం చేశారు. శరద్పవార్తో భేటీ తర్వాత సదరు నేత అజిత్ పవార్ను ప్రత్యక్షంగా సవాల్ చేశారు. ఆ నేత పేరు ఉత్తమ్ జంకర్. ధంగార్ సామాజిక వర్గంలో ఉత్తమ్ జంకర్ పెద్ద నాయకుడు. ధంగార్ సామాజిక వర్గ ఓటర్లు బారామతిలో భారీ సంఖ్యలో ఉండటమే దీనికి కారణం. ఉత్తమ్ జంకర్ ప్రభావం అజిత్ పవార్పై భారీగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 30 ఏండ్లుగా శరద్ పవార్తో తనకు ఉన్న శతృత్వాన్ని పక్కన బెట్టి, బారామతి ఎన్నికల్లో పవార్ కూతురు సుప్రియా సూలేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
జమాపూర్లో 30 ఏండ్లుగా తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కన బెట్టి ఉత్తమ్ జంకర్, మోహిత్ పాటిల్ కుటుంబాలు ఒక్కటయ్యాయి. మోహిత్ పాటిల్ను పార్లమెంట్కు పంపి, ఉత్తమ్ జంకర్ను ఎమ్మెల్యేను చేయాలన్నది రెండు కుటుంబాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. ఈ రెండు కుటుంబాలను ఏకం చేసేందుకు మోహిత్ పాటిల్, ఉత్తమ్ జంకర్ ఆరు నెలలుగా ఓపిగ్గా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. దీంతో మోహిత్ పాటిల్ కుటుంబంతో కలిసి పని చేయడంతోపాటు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ధైర్యవంతుడైన మోహిత్ పాటిల్ ఏదైనా చేయగలరని ఉత్తమ్ జంకర్ పేర్కొన్నారు. ఇదే జరిగితే మధా, బారామతి లోక్సభ స్థానాల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఉత్తమ్ జంకర్ను ఒప్పించేందుకు బీజేపీ నేత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తనను బీజేపీ మోసగించిందని ఉత్తమ్ జంకర్ ఆరోపించారు. పదేండ్లుగా ఏమీ చేయకుండా ఫడ్నవీస్ కాలం గడిపారని పేర్కొన్నారు.