Sanjay Raut | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్నాథ్ షిండే అజిత్పవార్కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అంతే కాకుండా పవార్ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మిది మందిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో మహరాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల గురించే వాడీవేడిగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్థానాన్ని అజిత్ పవార్ భర్తీ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. త్వరలో షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడబోతోందని చెప్పారు.
‘ఈ రోజు నేను కెమెరా ముందు ఈ విషయాన్ని చెబుతున్నాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారు. ఏక్ నాథ్ షిండేను తొలగించబోతున్నారు. ఏడాది క్రితం శివసేనలో చీలికలో భాగమైన షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా మారబోతున్నారు. త్వరలో మహా సీఎంగా అజిత్ పవార్ నియమితులవుతారు’ అని రౌత్ వ్యాఖ్యానించారు.
‘శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. ఇలా చేయడం వల్ల వారికి (బీజేపీ) ఎలాంటి ప్రయోజనం లేదు. 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఐక్యంగా పోరాడుతాం. ఎన్సీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ప్రధాని మోదీ చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పుడు ఆ నేతలే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు’ అని రౌత్ అన్నారు.
Also Read..
Sharad Pawar | కుటుంబంలో సమస్యలు లేవు.. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకూ ఆటంకం లేదు : ఎన్సీపీ చీలికపై పవార్
Jack Ma | పాక్లో జాక్ మా రహస్య పర్యటన..!