Ajit Pawar | ముంబై, అక్టోబర్ 4: మూడు పార్టీల సంకీర్ణంతో నెట్టుకొస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో ముసలం మొదలైంది. తమ పార్టీ అధినేత శరద్ పవార్ నుంచి విడిపోయి వేరే కుంపటి పెట్టుకుని అధికారంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మంగశవారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టడం, కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిగే సమావేశానికి సీఎం ఏక్నాథ్ షిండే, మరో డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్తో ఢిల్లీకి వెళ్లకుండా ఇంటికే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో తాను భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రి పదవుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది.
మహారాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయ అస్వస్థత ప్రారంభమైందని, ఇక ఆ ప్రభుత్వం ఎంతోకాలం అధికారంలో ఉండదని విపక్షాలు వ్యాఖ్యానించాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ‘రాజకీయ అస్వస్థత’కు గురయ్యారని, జిల్లాల్లో ఇన్చార్జి మంత్రుల నియామకంలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విపక్ష నేత విజయ్ వాడెట్టివార్ పేర్కొన్నారు. ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 నెలలు మాత్రమే అయ్యింది. అందులో ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందని విన్నా. అయినా హనీమూన్ ఇంకా ముగియకపోయినా వారు ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు’ అంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. అజిత్ గొంతు నొప్పితో బాధపడుతున్నారని, స్వల్పంగా జ్వరం కూడా ఉందని, అందుకే ఆయన క్యాబినెట్కు హాజరు కాలేదని ఆ పార్టీ నేత తెలిపారు.