ముంబై : ఇంధన ధరల మంటపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ ధరల మోతతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాము వీటిపై ఇప్పటికే పన్నులు తగ్గించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా పన్ను తగ్గించాలని కోరారు. రాష్ట్రం కంటే కేంద్ర ప్రభుత్వమే ఇంధనంపై పన్ను భారం అధికంగా మోపుతోందని, దీన్ని తగ్గించాలని అన్నారు.
ఇక ప్రజలు ఉచిత పధకాలను ఇష్టపడతారని అయితే రాజకీయ పార్టీలు దీర్ఘకాలిక అభివృద్ధి గురించి ఆలోచించాలని అజిత్ పవార్ అన్నారు. నీరు, విద్యుత్ ఉచితంగా అందిస్తే అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులు అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించారు.
కాగా పలు రాష్ట్రాలు ప్రజాకర్షక పధకాలను అమలు చేస్తుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత పధకాలు నిలకడగా కొనసాగించలేనివని అధికారులు ప్రధానికి వివరించారు. ఇదే ఒరవడి కొనసాగితే శ్రీలంక మార్గంలో ఆయా రాష్ట్రాలు తిరోగమించే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేశారు.