న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఫొటో మాయమైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ మాత్రమే పార్టీ పోస్టర్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అజిత్ పవర్ ఫొటో పోస్టర్లలో కనిపించకపోవడంపై ఆ పార్టీలో చర్చకు దారి తీసింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో అజిత్ పవార్ ఫొటో ఎక్కడా కనిపించలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ ఫొటోలు మాత్రమే ఆ బ్యానర్లపై ఉన్నాయి. వారిద్దరినీ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా శరద్ పవార్ ఇటీవల నియమించారు. కుమార్తె సుప్రియా సూలేకు మహారాష్ట్ర, ప్రఫుల్ పటేల్కు ఇతర రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఇటీవల గళమెత్తారు. తనకు పార్టీలో పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే మేనల్లుడు అజిత్ పవార్ అభ్యర్థనపై శరద్ పవార్ స్పందించారు. అలాంటి నిర్ణయం ఒక వ్యక్తి మాత్రమే తీసుకోవడం కుదరదని తెలిపారు. అజిత్ పవార్తో సహా పార్టీ కీలక నేతలు సమావేశమై ఆయన అభ్యర్థనపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీ పదవిని చేపట్టాలన్న సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుందని, అజిత్ పవార్ కూడా అదే సెంటిమెంట్ గురించి మాట్లాడినట్లు శరద్ పవార్ వెల్లడించారు.