లఖింపూర్ ఖీరీ, ఆగస్టు 18: సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన లఖింపూర్ రైతుల మరణానికి కారణమైన అజయ్ మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో 75 గంటల ధర్నాను ప్రారంభించింది.
లఖింపూర్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్, నేషనల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి భూదేవ్ శర్మ ఈ ధర్నాలో పాల్గొన్నారు. బాధిత రైతు కుటుంబాలకు పరిహారాన్ని ఇవ్వాలని రైతు నేత అవతార్ సింగ్ మెహ్లో డిమాండ్ చేశారు. కనీసమద్దతు ధరకు చట్టం తీసుకురావాలని, విద్యుత్తు బిల్లు 2022ను వెనక్కి తీసుకోవాలన్నారు.