న్యూఢిల్లీ : నిత్యావసరాలు, ఇంధన ధరలు ఇతర వస్తువుల ధరల మోతపై బీజేపీని విపక్షాలు టార్గెట్ చేశాయి. ధరల పెంపుతో సామాన్యుడు బతకలేని పరిస్ధితి నెలకొందని విపక్షాలు బీజేపీ సర్కార్పై విరుచుకుపడుతున్నాయి. ప్రజలపై ధరల భారం మోపారని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్పై ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దిన్ అజ్మల్ మండిపడ్డారు.
పెరిగిన ధరలతో వంటింటిని ఎలా నెట్టుకొస్తున్నారని తమ భార్యలను బీజేపీ ఎంపీలు అడగాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరలకు కళ్లెం వేయకుంటే 2024 ఎన్నికల్లో ద్రవ్యోల్బణం వారి ప్రభుత్వాన్ని కూల్చేస్తుందని ఏఐయూడీఎఫ్ చీఫ్ హెచ్చరించారు. నిత్యావసరాల ధరలు రికార్డుస్ధాయిలో పెరుగుతుండటంతో మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విమర్శల దాడిని తీవ్రతరం చేశాయి. గత కొద్దినెలలుగా ద్రవ్యోల్బణం పైకి ఎగబాకుతున్న తీరు పట్ల విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ధరల పెంపు, నిరుద్యోగ సమస్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. నల్ల చొక్కాలు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నివాసం ముట్టడి, రాష్ట్రపతి భవన్ వరకూ నిరసన ప్రదర్శన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ధరల పెంపునకు నిరసనగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు రాజ్భవన్ల వెలుపల నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి.