న్యూఢిల్లీ, నవంబర్ 5: నిరుద్యోగుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతున్నది. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు భర్తీచేయకపోగా, పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకు కూడా ఫలితాలు ప్రకటించకుండా నరకయాతన పెడుతున్నది. ఒక్క వైమానిక శాఖ ఉద్యోగాల కోసమే దాదాపు ఆరున్నర లక్షల మంది ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ఫోర్స్లోని ఎక్స్, వై క్యాటగిరీ పోస్టుల కోసం 2021 జూలైలో పరీక్ష నిర్వహించారు.
అంటే వివాదాస్పద అగ్నిపథ్ పథకాన్ని తేకముందే ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 6,34,249 మంది దరఖాస్తు చేసుకొన్నారు. పరీక్ష నిర్వహించిన ఒక నెలలో ఫలితాలు ప్రకటిస్తామని నోటిఫికేషన్లోనే వెల్లడించారు. ఇప్పటికి ఏడాది దాటిపోయినా అతీగతీ లేదు. ఫలితాలు ఎందుకు ఇవ్వటం లేదో తెలుసుకొనేందుకు ఉత్తరప్రదేశ్కు చెందిన కమిల్ అనే అభ్యర్థి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా, స్పష్టమైన సమాధానం కూడా ఇవ్వకపోవటం గమనార్హం.
వెబ్సైట్ మాయం
ఎయిర్మెన్ ఎక్స్, వై క్యాటగిరీ పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేవారు. 2020, 2021లో ఒకసారి మాత్రమే నిర్వహించారు. పరీక్ష ఫీజుగా ఒక్కో అభ్యర్థి నుంచి రూ.250 వసూలు చేశారు. ఈ లెక్కన మొత్తం రూ.15,85,62,250 ఫీజు వసూలైంది. అగ్నిపథ్ పథకం తెచ్చిన తర్వాత అంతకుముందు నిర్వహించిన పరీక్షలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దుచేస్తూ వస్తున్నది. అలా రద్దుచేసిన పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులకు ఫీజులను తిరిగి చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది.
కానీ ఎయిర్మెన్ అభ్యర్థులకు ఇంతవరకు ఫీజులు వెనక్కి రాలేదు. వెబ్సైట్ కూడా మాయమైంది. ఫలితాలను ఎందుకు ఆపారని ఆర్టీఐ కింద ప్రశ్నవేయగా, అగ్నిపథ్ ద్వారా పోస్టులను భర్తీచేసే యోచనలో బోర్డు ఉన్నదని సమాధానం ఇచ్చారు. కానీ, ప్రస్తుతం ఈ క్యాటగిరీ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఫీజులు తిరిగి చెల్లించే అంశంపై అసలే స్పందించలేదని కామిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.