న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: విమాన ఇంధన ధరల్లో ఆకస్మిక పెరుగుదల కార్యకలాపాలపై ఒత్తిడిని పెంచుతూ ఖర్చులను అధికం చేస్తున్న కారణంగా భారత విమానయాన పరిశ్రమ తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్ వంటి విమానయాన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్(ఎఫ్ఐఏ) పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఆకాశాన్నంటుతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరల కారణంగా ఈ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని హెచ్చరించింది. ధరలు అధికంగానే కొనసాగితే విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను పునఃసమీక్షించుకోవలసి వస్తుందని ఎఫ్ఏఐ పేర్కొన్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు ధరలు పెరగడంతో ఇటీవలి సవరణలలో ఏటీఎఫ్ ధరలు కిలో లీటరుకు రూ.2 లక్షల మేరకు పెరుగడమే ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయడమో లేదా పూర్తిగా మూసివేయడం తప్ప మరో మార్గం లేదని విమానయాన సంస్థలు స్పష్టంచేశాయి.
పెరిగిన నిర్వహణ వ్యయం
సాధారణంగా విమానయాన సంస్థల ఖర్చుల్లో 30-40 శాతం వాటా ఉండే విమాన ఇంధనం ఇప్పుడు నిర్వహణ ఖర్చుల్లో 55-60 శాతం వరకు పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పు లాభాల శాతాన్ని గణనీయంగా తగ్గించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన ఖర్చులు ఎక్కువగా ఉండటం, ధరల విషయంలో వెసులుబాటు పరిమితంగా ఉండటం వల్ల విమానయాన సంస్థలు ఈ పెరుగుదలను భరించడానికి ఇబ్బంది పడుతున్నాయని ఎఫ్ఐఏ తన లేఖలో పేర్కొన్నది. నిరంతరంగా అధికంగా ఉన్న ఇంధన ధరలు నగదు ప్రవాహాలపై ఒత్తిడి పెంచుతున్నాయని, ఇది ఈ రంగం అంతటా ఆర్థిక ఒత్తిడి మరింత పెంచుతున్నదని విమానయాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. తక్షణ, నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎఫ్ఐఏ కోరింది. తక్షణ చర్యగా ఏటీఎఫ్పై ఉన్న 11 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా తొలగించాలని, అలాగే కొన్ని ప్రాంతాల్లో 25% వరకు చేరగల రాష్ట్ర స్థాయి వ్యాట్ను తగ్గించేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
వ్యత్యాసం తగ్గడం లేదు
నిర్మాణాత్మక స్థాయిలో విమానయాన సంస్థలు జెట్ ఇంధనం కోసం మరింత ఊహించదగిన ధరల విధానాన్ని కోరుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ రిఫైనింగ్ మార్జిన్లలోని అస్థిరత లేదా క్రాక్ స్ప్రెడ్ల కారణంగా ఏటీఎఫ్ ధరలు అధికంగానే ఉంటున్నాయని అవి వాదిస్తున్నాయి. ముడి చమురు, జెట్ ఇంధన ధరల మధ్య ఉన్న వ్యత్యాసం కీలక ఆందోళనగా మారింది. ముడి చమురు ధరలు తగ్గిన రోజుల్లో సైతం ఏటీఎఫ్ ధరలు అధికంగానే ఉంటున్నాయని, దీంతో మార్గాలు, సామర్థ్యం, ధరల నిర్ణయం వంటివి ప్రణాళిక వేసుకోవడం కష్టంగా ఉందని విమానయాన సంస్థలు ప్రభుత్వానికి తెలిపాయి. భారత్లోని అధిక ఇంధన పన్నులు ప్రపంచ స్థాయి సంస్థలతో పోలిస్తే దేశీయ విమానయాన సంస్థలను ప్రతికూల స్థితిలో ఉంచుతున్నాయని, ఇది ముఖ్యంగా అంతర్జాతీయ మార్గాల్లో పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తున్నదని సమాఖ్య పేర్కొన్నది.
అధిక ఇంధన బిల్లులు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ముడి చమురు ధరలను పెంచగా హొర్ముజ్ జలసంధి వంటి సరఫరా మార్గాలపై ఆందోళనలు అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. విమానయాన సంస్థలకు దీని ప్రభావం నేరుగా అధిక ఇంధన బిల్లుల రూపంలో ఉంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విమానయాన సంస్థలు తమ సామర్థ్యాన్ని తగ్గించుకోవడానికి, మార్గాలను హేతుబద్ధీకరించడానికి లేదా చార్జీలను సర్దుబాటు చేయడానికి దారితీయవచ్చని పరిశ్రమ హెచ్చరించింది. దీని ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. అధిక ఇంధన ధరలు కొనసాగితే చార్జీల పెంపునకు దారితీయవచ్చని పలు విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. భారత్లో విమానయాన సంస్థలు ఇప్పటివరకు ఈ పెరుగుదలలో కొంత భాగాన్ని భరించాయి. కానీ ఖర్చులు అధికంగానే కొనసాగితే అలా కొనసాగించడానికి అవకాశం పరిమితంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
టికెట్ చార్జీలపై ప్రభావం
ప్రయాణికులకు దీని పర్యవసానాలు చాలా స్పష్టంగా ఉంటాయి. పెరిగిన ఇంధన ఖర్చులు సాధారణంగా కాలక్రమేణా టికెట్ ధరలపై ప్రభావం చూపుతాయి. అలాగే కొనసాగించడం కష్టంగా మారిన మార్గాల్లో విమానయాన సంస్థలు విమాన సర్వీసుల ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. ఎఫ్ఐఏ లేఖ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నది. ప్రస్తుత పరిస్థితి కేవలం పెరుగుతున్న ఖర్చులకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది మనుగడకు సంబంధించినది. ఇంధన ధరలు అధికంగానే ఉండి, పన్నులు యథాతథంగా కొనసాగితే విమానయాన సంస్థలపై ఒత్తిడి తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం చార్జీలు, మార్గాలు, మొత్తం సామర్థ్యంపై నేరుగా పడుతుంది.