Navitaire : నెవిటేర్ (Navitaire) వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా యూరప్ (Europe) తోపాటు ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai) సహా దేశంలోని ఎయిర్పోర్టుల (Airports) లో విమాన సర్వీసుల (Flight services) కు అంతరాయం ఏర్పడింది. దాంతో వేలమంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. నెవిటేర్ వ్యవస్థలో దాదాపుగా 45 నిమిషాలపాటు సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం 6.45 గంటల సమయంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. బుకింగ్, చెక్ఇన్ కోసం ఎయిర్లైన్ సంస్థలు ఉపయోగించే నెవిటేర్ వ్యవస్థలో ఈ సమస్యను గుర్తించారు. గంటలోపే దానిని పరిష్కరించారు. కానీ ఈ సమయంలో సిబ్బంది బుకింగ్, చెక్ఇన్లను మాన్యువల్గా నిర్వహించాల్సి వచ్చింది. దాంతో రద్దీ భారీగా పెరిగింది.
ముంబయిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ సాంకేతిక లోపం కారణంగా ఇండిగో, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసులపై ప్రభావం పడింది. రిజర్వేషన్లు, చెక్ఇన్, బోర్డింగ్ కోసం కీలకమైన ఎయిర్లైన్ టెక్నాలజీని నెవిటేర్ అందిస్తోంది. అది విఫలమైతే ప్యాసింజర్ వివరాలను ప్రాసెస్ చేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. ఇది జాప్యాలు, రద్దీకి దారితీస్తుంది.
కాగా గత నవంబర్లో ఢిల్లీలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్లో సాంకేతిక సమస్య కారణంగా 800కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయం రోజుకు 1500 విమాన సర్వీసుల్ని నిర్వహిస్తోంది. ముంబై విమానాశ్రయం నిర్వహించే సర్వీసుల సంఖ్య 1000 గా ఉంది.