Haj Yatra | న్యూఢిల్లీ, మే 1: ఇరాన్ వివాదం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే హజ్ కమిటీ హజ్ విమాన చార్జీని రూ. 10,000 పెంచాలని తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దృష్ట్యా విమాన చార్జీకి సవరణ అవసరమని ప్రభుత్వ సర్క్యులర్ తెలిపింది. సవరించిన విమాన చార్జీల ప్రకారం యాత్రికులు ఎక్కడ నుండి బయలుదేరుతున్నారని దానితో సంబంధం లేకుండా ప్రతి యాత్రికుడు అదనంగా 100 డాలర్లు (సుమారు రూ. 9,500) చెల్లించాల్సి ఉంటుంది అని హజ్ కమిటీ సర్క్యులర్ పేర్కొన్నది.
సర్క్యులర్ను రద్దు చేయాలి: ఒవైసీ
హజ్ యాత్రికుల నుంచి అదనంగా రూ. 10,000 వసూలు చేయడాన్ని దోపిడీగా అభివర్ణించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెంటనే సర్క్యులర్ను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితం ముంబై ఎంబార్కేషన్ పాయింట్ నుంచి బయలుదేరే ప్రతి యాత్రికుడి నుంచి రూ.90,844 వసూలు చేసినప్పటికీ ఇది జరిగిందని, ఇది వ్యక్తిగత ప్రయాణికులకు అమలులో ఉన్న రేట్లకు దాదాపు రెట్టింపని ఒవైసీ ఎక్స్లో పోస్టు చేశారు.
ప్రభుత్వ వివరణ
వివాదం తీవ్రతరం కావడంతో ప్రభుత్వ చర్యను సమర్థించుకునేందుకు మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ఏటీఎఫ్ ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు మొదట్లో ఒక్కో యాత్రికుడికి 300-400 డాలర్లు అదనంగా డిమాండ్ చేశాయని, కాని ప్రభుత్వం చర్చలు జరిపి ఆ పెంపును కేవలం 100 డాలర్లకు తగ్గించిందని రిజిజు చెప్పారు.