governer| బెంగళూరు: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ సిబ్బంది ప్రొటోకాల్ను ఉల్లంఘించారు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం లాన్లో ఎదురుచూస్తున్నప్పటికీ, ఆయనను ఎక్కించుకోకుండానే విమానాన్ని టేకాఫ్ చేశారు. దీనిపై గవర్నర్ ప్రొటోకాల్ అధికారులు ఎయిర్పోర్టు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ గెహ్లాట్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ ఏషియా విమానం రాగానే, గవర్నర్ లగేజ్ని కూడా అందులో ఎక్కించారు. అయితే గవర్నర్ టెర్మినల్2కు చేరుకునేందుకు ఆలస్యం అయిందని, దీంతో విమానం టేకాఫ్ అయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో గవర్నర్ 90 నిమిషాల తర్వాత మరో విమానంలో హైదరాబాద్కు చేరుకోవాల్సి వచ్చింది.
ఘటనపై ఎయిర్ఏషియా విచారం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. వృత్తిపరమైన అత్యున్నత ప్రమాణాలు, ప్రొటోకాల్ పాటించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నది. గవర్నర్ కార్యాలయంతో తమ సంబంధాలకు అత్యంత విలువనిస్తామని తెలిపింది.