Air Pollutions | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు. యయునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉన్నది. దేశ రాజధాని నగరంలో మంగళవారం ఉదయం గాలి నాణ్యత సూచి 400పైగానే నమోదైంది. ప్రస్తుతం నగరంలో సెకండ్ ఫేజ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలులో ఉన్నది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం.. ఉదయం 8 గంటలకు ఆనంద్ విహార్లో ఏక్యూఐ 457, అలీపూర్లో 389, వజీర్పూర్ 437, జహంగీర్పురి 440, రోహిణి 397, పంజాబీ భాగ్లో 403 ఏక్యూఐ రికార్డయ్యింది. కాలుష్యం నేపథ్యంలో విజిబులిటీ సైతం తగ్గింది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. వివేక్ విహార్, ఆనంద్ విహార్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకు దృశ్యమానత తగ్గింది. పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అత్యవసరమైతే బయటకు రావొద్దని సూచించారు.
ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని సూచిస్తున్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతోందని ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. కాలుష్య స్థాయిని తగ్గించేందుకు సంబంధిత ఏజెన్సీలన్నీ చురుగ్గా పని చేస్తున్నాయని.. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో శీతాకాల కార్యాచరణ ప్రణాళిక కింద వివిధ శాఖలు, ఏజెన్సీలు చేస్తున్న పనులను మంగళవారం సమీక్షించనున్నట్లు గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఇందులో అవసరాన్ని బట్టి తగిన చర్యలు తీసుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.