Air Pollution | ఢిల్లీ ఎన్సీఆర్తో సహా పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణమే పలు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించింది. దాంతో పాటు పంజాబ్లో భూగర్భ జలాలు అడుగంటుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. నీటిమట్టం నిరంతరం తగ్గుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. పంజాబ్లో వరిసాగుకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో వరి కొయ్యలను తగులబెట్టడం ఆపాలని స్పష్టం చేసింది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ ‘తాము ఓ పద్ధతిని సూచించాం. మీకు కావాల్సింది చేయొచ్చు. కానీ, వ్యవసాయ క్షేత్రాల్లో తగులబెట్టే సంఘటనలను ఆపాలి. కాల్చివేతను ఆపేందుకు కొన్ని అత్యవసర చర్యలు అవసరం. పంజాబ్లో నీటిమట్టాన్ని తగ్గకుండా.. వరిని సాగు చేయకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలు ఏంటని కేంద్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో స్వల్ప వర్షం కురవడంతో కాలుష్యం నుంచి కాస్త ఊరటనిచ్చింది. ఈ క్రమంలో జస్టిస్ కౌల్ స్పందిస్తూ.. వర్షం కురుస్తూనే ఉండాలని ప్రజలు ప్రార్థనలు చేయాలన్నారు.
కొన్నిసార్లు గాలి నుంచి, మరికొన్ని సార్లు వర్షం నుంచి ఉపశమనం ఉంటుందన్నారు. బహుశా దేవుడు ప్రజల ప్రార్థనలను విని ఉంటాడని.. అందుకే వర్షం కురిసి ఉంటుందని ఆయన అన్నారు. రైతులు సమాజంలోనే భాగమేనని.. వారు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. పంజాబ్లో రైతులు చాలా సంఘటితమై ఉన్నారని, రైతు సంఘాలతో ఎందుకు మాట్లాడరని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాలుష్య స్థాయిని తగ్గించాలని.. రేపటి కోసం వేచి ఉండలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో సరి-బేసి విధానంలో అమలు విషయంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని మదలించింది.