న్యూఢిల్లీ: వాయు కాలుష్యం( Air pollution ) ఉసురు తీస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన ఎక్కువగా పడుతున్నట్లు అమెరికా రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఈ వాయు కాలుష్యంపై అధ్యయనం జరిపింది. మధ్య, తూర్పు, ఉత్తర భారతంలో నివసిస్తున్న 48 కోట్ల మందికి ఈ ముప్పు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.
తగ్గుతున్న జీవితకాలం
ప్రతి ఏటా ఇండియాలో అత్యధిక కాలుష్య స్థాయి ఉన్న ప్రాంతాలు పెరుగుతున్నట్లు కూడా స్పష్టం చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లాంటి రాష్ట్రాల్లో కూడా కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగిపోయినట్లు ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో తెలిపింది. దీని కారణంగా దేశంలోని సుమారు 40 శాతం మంది జీవితకాలం 9 ఏళ్ల వరకూ తగ్గిపోతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తరచూ ప్రమాదకర స్థాయిని మించిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వాయు కాలుష్యం ఉన్న రాజధాని నగరంగా వరుసగా మూడో ఏట కూడా ఢిల్లీ నిలిచింది. గతేడాది వేసవిలో కరోనా లాక్డౌన్ కారణంగా ఢిల్లీ వాసులు కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చినా.. ఆ తర్వాత శీతాకాలానికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఆ కార్యక్రమం బాగుంది
ఇండియాలో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి 2019లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) ప్రారంభించింది. ఈ కార్యక్రమం చాలా బాగుందని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ చెప్పింది. ఈ కార్యక్రమం లక్ష్యాలను చేరుకుంటే భారతీయుల జీవితకాలం 1.7 ఏళ్ల మేర పెరగనున్నట్లు అంచనా వేసింది. ఈ కార్యక్రమం కింద వాయు కాలుష్యం అధికంగా ఉన్న 102 నగరాల్లో 2024 కల్లా కాలుష్యాన్ని 20-30 శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.