ముంబై: ఎయిర్ ఇండియా సంస్థ ఇటీవల ఓ భారీ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎయిర్బస్, బోయింగ్ సంస్థల నుంచి భారీ సంఖ్యలో విమానాలు కొనుగోలు చేయనున్నది. అయితే ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు 470 విమానాలను నడిపిస్తుందని, ఒకవేళ అన్ని విమానాలు నడవాలంటే సుమారు 6500 మంది పైలట్లు అవసరమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన ఆపరేషన్స్ విస్తరించాలనుకున్న ఎయిర్ ఇండియా సుమారు 840 విమానాలను ఖరీదు చేయనున్నది. దాంట్లో 370 భారీ విమానాలు ఉండనున్నాయి.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద ఉన్న 113 విమానాల కోసం 1600 మంది పైలట్లు ఉన్నారు. సిబ్బంది కొరత వల్ల ఇటీవల దూరం ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా వద్ద 850 మంది పైలట్లు ఉన్నారు. వాళ్లు 54 విమానాలను నడుపుతున్నారు. విస్తారా వద్ద సుమారు 600 మంది పైలెట్లు ఉన్నారు. ఆ సంస్థ వద్ద 53 విమానాలు ఉన్నాయి.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విస్తారా, ఎయిర్ ఏషియా సంస్థల వద్ద మొత్తం మూడు వేల మంది పైలట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 40 ఏ350 విమానాల కోసం కనీసం ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ కోసం 30 మంది పైలట్లు, 15 మంది కమాండర్లు, 15 మంది ఫస్ట్ ఆఫీసర్లు అవసరం ఉంటుంది. అంటే కేవలం ఏ350 విమానాలకే సుమారు 1200 మంది పైలట్లు అవసరం రానున్నది.
ఒక బోయింగ్ 777 విమానం కోసం సుమారు 26 మంది పైలట్లు అవసరం ఉంటుంది. ఒకవేళ పది బోయింగ్ విమానాలు వస్తే, అప్పుడు 260 మంది పైలట్లు అవసరం వస్తుంది. ఇక 20 బోయింగ్ 787 విమానాలకు కనీసం 400 మంది పైలట్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క విమానం కోసం 20 మంది పైలట్లు, 10 మంది కమాండర్లు, 10 మంది ఫస్ట్ ఆఫీసర్లు కావాల్సి ఉంటుంది.
30 వైడ్ బాడీ బోయింగ్ విమానాల కోసం కనీసం 660 పైలట్లు అవసరం ఉంటుందని విమాన సంస్థ వర్గాలు అంచనా వేస్తున్నాయి.