న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల ఇవాళ ఎయిర్ ఇండియా చర్య తీసుకున్నది. సదురు ప్రయాణికుడిపై 30 రోజుల నిషేధం విధిస్తున్నట్లు ఇవాళ ఎయిర్ ఇండియా వెల్లడించింది. అనుచితంగా వ్యవహరించిన ఆ వ్యక్తిపై అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఒకవేళ ఆ ప్రయాణికుడు దోషిగా తేలితే, ఎయిర్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రతినిధి తెలిపారు.
ఎయిర్ ఇండియా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల కూడా కమిటీ విచారణ ద్వారా నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రతినిధి తెలిపారు. తక్షణమే ఆ మహిళా ప్యాసింజెర్కు సాయం చేయలేని పరిస్థితిపై వివరణ ఇవ్వనున్నారు. బాధిత ప్రయాణికురాలితో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నామని, విచారణ సమయంలో ఆమె కుటుంబంతో టచ్లో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి వస్తున్న సందర్భంలో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 22వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఫిర్యాదు చేసినట్లు ఎయిర్ ఇండియా పేర్కొన్నది. నిజానికి ఆ వ్యక్తిపై చర్యను తీసుకోవాలని విమానంలోని క్యాబిన్ సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళా ప్యాసింజెర్.. టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్కు లేఖ రాశారు. ఆ తర్వాతే ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.
భోజనం తర్వాత లైట్లను డిమ్ చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్యాసింజెర్ మూత్రం పోయడం వల్ల తన దుస్తులు, బ్యాగ్, షూ తడిసినట్లు ఆమె ఆరోపించారు. విమానం సిబ్బంది తనకు దుస్తుల్ని, చప్పులను ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఫస్ట్ క్లాస్లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నా.. సిబ్బంది సీటులో ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.