న్యూఢిల్లీ: మహిళా శక్తిని చాటేలా ఎయిరిండియా గ్రూప్ వినూత్న చర్యలు చేపట్టింది. మార్చి 1-8 వరకు 90కి పైగా విమాన సర్వీసులను మొత్తం మహిళా సిబ్బందితోనే నడిపించింది. జేఆర్డీ టాటా మొదటి వాణిజ్య విమానం నడిపి 90 ఏండ్లు అయిన సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడానికే 90కి పైగా విమాన సర్వీసులను ఇందుకు ఎంచుకున్నట్టు ఎయిరిండియా గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎయిరిండియా, ఏఐ ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా సంస్థలకు చెందిన విమానాలను మహిళలతో నడిపించామని తెలిపింది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు ఉన్నట్టు వెల్లడించింది. సాధారణంగా మగవారి ఆధిపత్యం ఉండే విమానయాన విభాగాల్లో తమ ఉద్యోగినులు కీలక స్థానాల్లో ఉన్నారని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సీఈవో అలోక్ సింగ్ పేర్కొన్నారు.