ముంబై : ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్య కారణంగా తిరిగి విమానాశ్రయానికి చేరుకుందని అధికారులు తెలిపారు. టాటాగ్రూప్నకు చెందిన ఏ320neo విమానం ఉదయం 9.43 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చెన్నైకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో 10.10 గంటలకు ల్యాండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని మళ్లించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తిరిగి సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానం బెంగళూరుకు చేర్చినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, పరిస్థితులను చక్కగా నిర్వహించడంలో సిబ్బంది నైపుణ్యం కలిగి ఉన్నారని, ఇంజినీరింగ్, నిర్వహణ బృందాలు సమస్యను పరిశీలిస్తున్నాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.