న్యూఢిల్లీ : మస్కట్ నుంచి కొచ్చి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ అవుతుండగా నిలిచిపోయింది. మస్కట్ ఎయిర్పోర్ట్లో బుధవారం రన్వేపై సిద్ధంగా ఉన్న విమానం ఇంజన్లలో ఒక ఇంజన్ నుంచి పొగ రావడంతో ముందుజాగ్రత్తగా విమానంలో ఉన్న 141 మంది ప్రయాణీకులతో పాటు ఆరుగురు సిబ్బందిని దించివేశారు.
ప్రయాణీకులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం నుంచి పొగలు రావడంతో ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. దీంతో 14 మందికి గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనకు కారణాలను పసిగట్టేందుకు ఇంజనీర్ల బృందం తనిఖీ చేస్తోంది. ప్రయాణీకులందరినీ కొచ్చి తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
వేరొక విమానంలో ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేరుస్తామని, ఘటనపై దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు చేపడతామని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా రెండు నెలల కిందట కాలికట్ నుంచి దుబాయ్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానాన్ని కాలుతున్న వాసన రావడంతో దుబాయ్కు దారిమళ్లించిన ఘటన చోటుచేసుకుంది.