Air India Express : జెడ్డా (Jeddah) కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం (Air India Express Flight) లో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 7.40 గంటలకు కన్నూర్ (Kannur) నుంచి జెడ్డాకు బయలుదేరిన విమానం.. రెండు గంటల్లో తిరిగి బయలుదేరిన చోటుకే చేరింది. విమానం కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఇంజిన్ (Engine) లో ఏదో సాంకేతక లోపం ఉన్నట్లు వార్నింగ్ లైట్స్ (Warning lights) వచ్చాయి.
దాంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించారు. ఆ మేరకు టేకాఫ్ అయిన తర్వాత రెండు గంటల్లోనే తిరిగి కన్నూర్ ఎయిర్పోర్టులో విమానాన్ని ల్యాండింగ్ చేశారు. దాంతో ఆ విమానంలోని 180 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం విమానాన్ని పరిశీలించిన నిపుణులు ఇంజిన్ ఫ్యూయల్ ఫిల్టర్లో లోపం ఉన్నట్లు గుర్తించారు.
అయితే ల్యాండింగ్కు ముందు పైలట్లు ముందుజాగ్రత్తగా విమానాన్ని విమానాశ్రయం చుట్టూ చక్కెర్లు కొట్టించారు. జరగరానిది ఏదైనా జరిగినా ఇంధనం కారణంగా ప్రమాద తీవ్రత ఎక్కువ కాకుండా, ఇంధనాన్ని ఖర్చు చేసేందుకు ఇలా చేసినట్లు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.