న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈశాన్య సరిహద్దులో భారీ వాయు విన్యాసాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) సిద్ధమైంది. ఈశాన్య ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో మరి కొన్ని రోజుల్లో ‘ప్రళయ్’ పేరుతో వైమానిక విన్యాసాలు చేపట్టనున్నది. దీనికి కోసం ఇప్పటికే పలు సన్నాహాలు చేసింది. డ్రోన్ స్క్వాడ్రన్ను సరిహద్దు ప్రాంతానికి తరలించడంతోపాటు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ను మోహరించింది. రాఫెల్, సుఖోయ్-30 యుద్ధ విమానాలతోపాటు రవాణా, ఇతర విమానాలతో మెగా వాయు విన్యాసాలు నిర్వహించనున్నది.
కాగా, ఈశాన్య సరిహద్దులోని డొక్లామ్ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను చైనా పెంచుతున్నది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళానికి చెందిన తూర్పు కమాండ్ అప్రమత్తమైంది. ఎల్ఏసీ సమీపంలోకి చైనా యుద్ధ విమానాలు దూసుకురావడాన్ని గమనించిన భారత యుద్ధ విమానాలు ఇటీవల పలుసార్లు తరిమికొట్టాయి.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల కమాండ్ స్థాయి వాయు విన్యాసాలను ఐఏఎఫ్ నిర్వహించింది. ఇది జరిగిన పక్షం రోజుల్లో తాజాగా రెండోసారి భారీ స్థాయి వాయు విన్యాసాలు చేపట్టేందుకు భారత వాయు దళం సన్నద్ధమైంది.