న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 2022 జనవరి నుండి రాఫెల్ ఫైటర్ ఫ్లీట్ను అప్గ్రేడ్ చేయనున్నది. నిర్దిష్టమైన భారతీయ ప్రమాణాల మేరకు రాఫెల్ యుద్ధ విమానాల ఫ్లీట్ను మెరుగుపరచనున్నది. ఇస్ట్రెస్ ఎయిర్బేస్లో టెయిల్ నంబర్ RB-008తో టెస్ట్బెడ్ ఎయిర్క్రాఫ్ట్ పనితీరును అంచనా వేయడానికి భారత వైమానిక దళ అధికారుల ఉన్నత స్థాయి బృందం ఫ్రాన్స్లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2016లో ఫ్రాన్స్తో భారత్ చేసుకున్న ఒప్పదం మేరకు రాఫెల్ విమానాలను భారత నిర్దిష్ట ప్రమాణాలతో మెరుగుపర్చనున్నట్లు వెల్లడించాయి.
ఐఏఎఫ్ ఆమోదం తర్వాత రాఫెల్ జెట్స్ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు 2022 జనవరి నుంచి అంబాలా రాఫెల్ ఫ్లీట్ అప్గ్రేడ్ ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారతీయ అవసరాలకు అనుగుణంగా అత్యంత సామర్థ్యం గల క్షిపణులు, తక్కువ బ్యాండ్ జామర్లు, ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణ వంటి మార్పులు చేపట్టనున్నట్లు వివరించాయి. రాఫెల్ మొదటి స్థావరం అయిన అంబాలా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో వీటి నవీకరణ జరుగుతుందని వెల్లడించారు.
కాంట్రాక్ట్ షెడ్యూల్ ప్రకారం వైమానిక దళానికి చెందిన వర్గాలు ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఈ కిట్లను తీసుకువస్తారు. ప్రతి నెలా మూడు నుండి నాలుగు భారతీయ రాఫెల్లను ఐఎస్ఈ ప్రమాణాల మేరకు అప్గ్రేడ్ చేస్తారు. ఫ్రాన్స్ నుండి భారతదేశానికి వచ్చే చివరి విమానం RB-008. మాజీ వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ RKS భదౌరియా (రిటైర్డ్) పేరు దీనికి పెట్టారు. రూ.60,000 కోట్లతో 36 రాఫెల్స్ కొనుగోలుకు ఫ్రాన్స్తో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై సంతకం చేయడంలో డిప్యూటీ చీఫ్గా ఆయన కీలక పాత్ర పోషించారు.
కాగా, 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల్లో ఇప్పటికే 30కిపైగా విమానాలు భారత్కు చేరాయి. డిసెంబర్ 7-8 తేదీల్లో మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా జరుగనున్నది. మొత్తం సరఫరా అనంతరం అంబాలా రాఫెల్ ఫ్లీట్లో RB సిరీస్ టెయిల్ నంబర్లతో ఎనిమిది ట్విన్-సీటర్ ట్రైనర్ విమానాలుంటాయి.
పశ్చిమ బెంగాల్తోపాటు దక్షిణాన ఏర్పాటు చేసే మిగతా రెండు రాఫెల్ ఫ్లీట్లో BS టెయిల్ నంబర్ సిరీస్తో 28 సింగిల్-సీటర్ విమానాలుంటాయి. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ వైమానిక దాడులకు నాయకత్వం వహించి అదే ఏడాదిలో పదవీ విరమణ చేసిన మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ BS ధనోవా గౌరవార్థం 28 రాఫెల్ జెట్లకు BS టెయిల్ నంబర్లు కేటాయించనున్నారు.