న్యూఢిల్లీ : అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంపై సైనిక ఉద్యోగార్ధులు వీధుల్లో హింసాత్మక నిరసనలకు పాల్పడుతున్న నేపధ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి కీలక ప్రకటన చేశారు. ఆందోళనలో చురుకుగా పాలుపంచుకుంటున్న రక్షణ శాఖ ఉద్యోగార్ధులు భవిష్యత్లో భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ తరహా హింసను తాము ఖండిస్తున్నామని, హింస సమస్యకు పరిష్కారం కాబోదని వ్యాఖ్యానించారు.
హింసాత్మక నిరసనలో పాల్గొనే వారికి తదుపరి పోలీస్ వెరిఫికేషన్లో క్లియరెన్స్ లభించదని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీం సానుకూల చర్యగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంపై సందేహాలు ఉన్నవారు సమీప సైనిక స్టేషన్లు, ఎయిర్ ఫోర్స్, నావికా బేస్లను సందర్శించి తమ సందేహాలను తీర్చుకోవచ్చని సూచించారు.
అగ్నిపథ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే దాని ప్రయోజనాలు పూర్తిగా వారికి అర్ధమవుతాయని అన్నారు. మరోవైపు అగ్నిపథ్ స్కీంను తక్షణమే వెనక్కితీసుకోవాలని, సాగు చట్టాల రద్దు తరహాలో ఈ స్కీంను ఉపసంహరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కేంద్రం అనాలోచిత నిర్ణయంతోనే ఈ దుస్ధితి నెలకొందని అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.