న్యూఢిల్లీ: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వేగంగా దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ ఎయిర్ ఆంబులెన్సు సేవలను ప్రారంభించింది. హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్(హెచ్ఈఎంఎస్) పేరుతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మొదట రిషికేష్లోని ఎయిమ్స్ దవాఖానలో ఒక ఎయిర్ ఆంబులెన్స్ పని చేయనుంది.
ఇది దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ఆంబులెన్స్. ఈ హెలికాప్టర్లో అత్యవసర వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు ఉంటాయి. ఒక పేషెంట్ను 100 నాటికల్ మైళ్ల దూరానికి తరలించేందుకు వీలుగా ఈ ఎయిర్ ఆంబులెన్స్ను సిద్ధం చేశారు. త్వరలో ఈ సర్వీసును దేశవ్యాప్తంగా విస్తరించాలని పౌర విమానయాన శాఖ భావిస్తున్నది.