బెంగళూరు, ఆగస్టు 24: 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి ఉపరితలానికి చేరుకున్నది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండర్ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే ఇతర దేశాలు చంద్రుడి ఈక్వేటోరియల్ రీజియన్ ప్రాంతంలో ల్యాండర్ను దించగా… ఇస్రో మాత్రం దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉండే ఆ ప్రాంతంలోనే ఎందుకు ల్యాండర్ను దించారనే అంశం అందరి మదిని తొలుస్తున్నది. ఆ ప్రాంతంలో ల్యాండర్ను దించడానికి గల కారణాలు, భారత్కు కలిగే ప్రయోజనాలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
చంద్రుడిపై మానవాళి నివసించేందుకు దక్షిణ ధ్రువ ప్రాంతంలో అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఆయన వివరించారు. ‘జాబిల్లి ధ్రువ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో సూర్యరశ్మి ప్రసరించే అవకాశం చాలా తక్కువ. సూర్యుడు, భూమి, చంద్రుడి పుట్టుక గురించి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికే అక్కడి మట్టిలో నిక్షిప్తమై ఉంటుంది. అక్కడ పరిశోధనల ద్వారా వాటిపై ఓ అవగాహనకు రావచ్చు. మానవాళి నివాసం కోసం అనువైన ప్రదేశం కోసం ఎన్నో ఏండ్లుగా అన్వేషణ కొనసాగుతున్నది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని ఇతర గ్రహాలపై వెళ్లేందుకు ప్రయోగాలు చేయవచ్చు. చంద్రయాన్-3 ద్వారా ఖనిజాలు, నీటి జాడలు కూడా తెలిసే అవకాశం ఉంది. గతంలో వివిధ దేశాలు చంద్రుడి ఈక్వేటోరియల్ రీజియన్లో తమ ల్యాండర్లను దించాయి. అక్కడ ల్యాండర్లు దించేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తాయి. అవి అందించే సమాచారం కీలకంగా మారనుంది’ అని సోమనాథ్ తెలిపారు.