న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన సర్వర్లపై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. హాంకాంగ్లోని రెండు ఈ మెయిల్ ఐడీల నుంచి ఈ సైబర్ దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ రెండు మెయిల్స్కు సంబంధించి ఐపీ అడ్రస్లను గుర్తించగా.. ఇందులో చైనా పాత్ర తెరపైకి వస్తున్నది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ పోలీసులు ఇందు కోసం గుజరాత్ సైన్స్ యూనివర్సిటీ సహకారం తీసుకుంటున్నారు. కేసుకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఐఎఫ్ఎస్ఓ బృందం సూరత్తో పాటు ముంబయికి బయలుదేరాయి.
అయితే, సైబర్ దాడికి పాల్పడిన వ్యక్తులు ఇంకా డబ్బు డిమాండ్ చేయలేదని స్పెషల్ సెల్ సీనియర్ అధికారులు పేర్కొంటుండగా.. రూ.200కోట్ల వరకు డిమాండ్ చేశారనే ప్రచారం జరుగుతున్నది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ ఎయిమ్స్పై గత నెల 23న సైబర్ దాడి జరిగిన విషయం విధితమే. ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలకు మొదట సాంకేతిక సమస్యలుగా భావించారు. ఆ తర్వాత ఎయిమ్స్ సర్వర్స్ యాంటీవైరస్ లైసెన్స్ గడువు ముగిసిపోయింది. ఎయిమ్స్లోని నాలుగు సర్వర్లు, రెండు అప్లికేషన్ సర్వర్లు, ఒకటి డేటాబేస్, మరొకటి బ్యాకప్ సర్వర్ సైబర్ దాడికి గురయ్యాయి. కేసు నమోదు చేసి అనంతరం స్పెషల్ సెల్ దర్యాప్తు ప్రారంభించింది. రెండు మెయిల్ ఐడీల నుంచి సర్వర్లపై సైబర్ దాడి జరిగిందని దర్యాప్తులో తేలింది.
విచారణలో వీటి మూలాలను చైనాలో ఉన్నట్లు గుర్తించారు. 146.196.54.222 ఐపీకి సంబంధించిన అడ్రస్ను హాంకాంగ్కు చెందిన గ్లోబల్ నెట్వర్క్స్దిగా గుర్తించామని, ఇందులో చైనా పాత్ర ఉండవచ్చని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు స్పెషల్ సెల్ ఎయిమ్స్ సర్వర్ ఇమేజింగ్ను గాంధీనగర్లోని గుజరాత్ సైన్స్ యూనివరిటీకి పంపింది. సర్వర్ ఇమేజింగ్ పరిశీలించిన తర్వాత పరిస్థితి తెలుస్తుందని స్పెషల్ సెల్ అధికారులు తెలిపారు. ఎయిమ్స్లో 50 సర్వర్లు ఉండగా.. నాలుగు సైబర్ దాడికి గురయ్యాయి.