చెన్నై: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వరుసగా రెండో రోజు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. (AIADMK Walkout) ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి అధికారంలో ఉన్న డీఎంకేపై మండిపడ్దారు. అధికార పార్టీ ‘ఊసరవెల్లి’గా మారిందని విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో వివాదస్పద మంత్రులైన కే పొన్ముడి, కెఎన్ నెహ్రూ, వీ సెంథిల్ బాలాజీలపై అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు అన్నాడీఎంకే సభ్యులు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఎం.అప్పావు నిరాకరించారు. దీంతో నిరసనగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి ఈ సందర్భంగా అధికార డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేస్తున్నదని విమర్శించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కాపాడుతున్నారని ఆరోపించారు. సీఎం స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని పళనిస్వామి ప్రశ్నించారు. ‘వారి ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనం. రాజకీయ సౌలభ్యం కోసం రంగులు మార్చే ‘ఊసరవెల్లి’గా డీఎంకే మారింది’ అని మండిపడ్డారు.