చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత ఎడ్డప్పాడి పళనిస్వామి తన మద్దతుదారులతో కలిసి బుధవారం నిరాహార దీక్షకు దిగారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేడియంకు తరలించారు. కాగా, అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పన్నీర్ సెల్వంను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే మంగళవారం జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పళనిస్వామి గందరగోళం సృష్టించారు. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించినందున సభలో డిప్యూటీ ప్రతిపక్ష నేత స్థానం నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సభలో గందరగోళం నేపథ్యంలో పళనిస్వామి, ఆయన వర్గాన్ని హిందీ వ్యతిరేక తీర్మానం కోసం అనుమతించబోనని స్పీకర్ తెలిపారు. దీంతో పళనిస్వామి తన వర్గంతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. నిరసనగా బుధవారం చెన్నైలోని వల్లువర్ కొట్టం ప్రాంతంలో తన వర్గంతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. అయితే నిరసనకు అనుమతి లేదంటూ పళనిస్వామితోపాటు ఆయన వర్గాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.