AIADMK | పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ధ్రువీకరించింది. ఎలక్షన్ కమిషన్ పంపిన నోట్ను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎం బాబీ మురగవేల్ గురువారం ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే చేసిన పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా.. గతేడాది పార్టీ నుంచి ఓ పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారిస్తున్నది. అదే సమయంలో పళనిస్వామి నియామకంపై సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై గురువారం మద్రాస్ హైకోర్టు విచారించనున్నది. పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పళనిస్వామి 2017 నుంచి 2021 వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. 2017 నుంచి 2022 వరకు పళనిస్వామి అన్నాడీఎంకే జాయింట్ కోఆర్డినేటర్గా పనిచేశారు. 2022 నుంచి 2023 వరకు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
ఇక పన్నీర్ సెల్వం 6 డిసెంబర్ 2016 నుంచి.. 15 ఫిబ్రవరి 2017 వరకు తమిళనాడు ఆరో ముఖ్యమంత్రిగా పని చేశారు. పన్నీర్సెల్వం 21 ఆగస్టు 2017 నుంచి 6 మే 2021 వరకు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా 11 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే, పార్టీ అధ్యక్షురాలు జయలలిత మరణం తర్వాత ఇద్దరు నేతలు పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. ఇంతకు ముందు ఈ-రోడ్ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా.. ఇద్దరు నేతలు వేర్వేరుగా అభ్యర్థులను ప్రకటించారు. పన్నీర్ సెల్వం సెంథిల్ మురుగన్ పేరు ప్రతిపాదించగా.. కేఎస్ తెన్నరసు పేరును పళనిస్వామి ప్రతిపాదించారు.