Acid Attack on Wife | తనకు దూరమైన భార్యపై ఓ భర్త విచక్షణ మరిచి ఆసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఒద్దావ్ ప్రాంతానికి చెందిన 42 ఏండ్ల యువకుడు భారత్ పర్మార్.. తన 36 ఏండ్ల భార్య చంద్రికాబెన్ పర్మార్ విభేదాలతో వేర్వేరుగా ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొమ్మిది నెలలుగా చంద్రికాబెన్ పర్మార్ తన పిల్లలతో కలిసి వేరుగా జీవిస్తున్నది. ఒద్దావ్లోని పవర్ కోటింగ్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నది.
మంగళవారం పని ముగించుకుని సహచరులతో కలిసి చంద్రికాబెన్ పర్మార్ ఇంటికెళుతుండగా భారత్ పర్మార్ తనను కలిసి ఇంటికి తిరిగి రావాలని కోరాడు. ఆమె అందుకు నిరాకరించడంతో తన వద్ద బాటిల్లో సిద్ధంగా ఉంచుకున్న యాసిడ్ను ఆమెపై పోసి పరారయ్యాడు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చంద్రికాబెన్ తెలిపారు.
యాసిడ్ మీద పోయడంతో గాయపడ్డ చంద్రికా బెన్ను ఆమె వెంట ఉన్న సహచరులు అంబులెన్స్ పిలిపించి దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై పోలీసులు ఐపీసీలోని 326బీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేయలేదని చెప్పారు.