పట్నా: గుజరాతీలే మోసగాళ్లంటూ అనుచిత కామెంట్స్ చేసిన కేసులో బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) కు అహ్మదాబాద్లోని మెట్రోపాలిటన్ కోర్టు (Metropolitan court) సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 22న తేజస్వియాదవ్ కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ డీజే పర్మార్ (DJ Parmar) నోటిసులలో పేర్కొన్నారు.
అహ్మదాబాద్కు చెందిన 69 ఏళ్ల సామాజిక కార్యకర్త హరీశ్ మెహతా.. గుజరాతీల ఉద్దేశించి తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మెట్రోపాలిటన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 499, 500 ప్రకారం తేజస్విపై కేసులు నమోదు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం తేజస్వి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.
తేజస్వియాదవ్ ఈ ఏడాది మార్చి 21న బీహార్ రాజధాని పట్నాలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘గుజరాతీలే మోసగాళ్లు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రికార్డులను కూడా హరీశ్ మెహతా కోర్టుకు సమర్పించారు.