కోల్కతా: మధ్యాహ్న భోజనంలో భాగంగా స్కూల్ పిల్లలకు కోడికూర, సీజనల్ పండ్లు అందించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి వచ్చే నాలుగు నెలల పాటు దీనిని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనికి అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. మధ్యాహ్న భోజనంలో భాగంగా ప్రస్తుతం అన్నం, ఆలుగడ్డ, సోయాబీన్, గుడ్లు అందిస్తున్నారు. వాటితోపాటు వారంలో ఒకరోజు చికెన్, కాలానికి అనుగుణంగా వచ్చే పండ్లు ఇవ్వాలని వెల్లడించింది. దీనిని జనవరి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు కొనసాగించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. దీనికోసం అదనంగా రూ.371 కోట్లు మంజూరు చేసింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1.16 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానమంత్రి పోషన్ అభియాన్ పథకంలో భాగంగా వారందరికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను భరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో గ్రామపంచాయతి ఎన్నికలు జరుగనుండటం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శినాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు చికెన్ అందిస్తున్నారని విరుచుకుపడుతున్నాయి.