పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ఈ నెల 12న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. ఆదివారం 16 మంది బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అనంతరం బస్సులో నగర శివారులోని రిసార్ట్కు వారిని తరలించారు. మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ చేరుకుంటారని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్ తెలిపారు.
కాగా, బీహార్కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనోహర్ ప్రసాద్ సింగ్, సిద్ధార్థ్ సౌరవ్ ఈ బృందంలో చేరలేదు. ప్రసాద్ సింగ్ తర్వాత చేరుతారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్తో విభేదాలున్న సిద్ధార్థ్ సౌరవ్, మరి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ బీహార్ ఇన్ఛార్జ్ మోహన్ ప్రకాష్, తమ ఎమ్మెల్యేల ఫిరాయింపు పుకార్లను తోసిపుచ్చారు. వాస్తవానికి జేడీ(యూ) ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారని అన్నారు. కాగా, ఎన్డీయే కూటమికి చెందిన మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) మద్దతును ప్రతిపక్ష మహాకూటమి కోరుతున్నది. జితన్ రామ్కు సీఎం పదవి, ఆయన కుమారుడికి మంత్రి పదవి కూడా ఆఫర్ చేసింది.
కాగా, జార్ఖండ్లోని అధికార జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్లో రిసార్ట్ రాజకీయం సాగించారు. బలపరీక్షలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి రాంచీకి తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం జరిగిన ఫ్లోర్ టెస్ట్లో జేఎంఎం ప్రభుత్వం నెగ్గింది.