లక్నో : మొఘల్ పాలకుడు ఔరంగజేబుపై ఆగ్రా నగర మేయర్, మేయర్ల మండలి జాతీయ అధ్యక్షుడు నవీన్ జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు ఉగ్రవాది అని ఆయన పేరుతో ఎలాంటి ప్రాంతం, రహదారుల పేర్లు ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఔరంగజేబు పేరుతో ఉన్న రోడ్ల పేర్లను తక్షణమే మార్చాలని అన్నారు. ఔరంగజేబు శిలా ఫలకాలను తొలగించి ఆయన పేరిట ఉన్న రోడ్ల పేర్లను మార్చాలని నవీన్ జైన్ పేర్కొన్నారు.
ఆగ్రాలో జరిగిన జాతీయ మేయర్ల మండలి సమావేశంలో పలు నగరాల మేయర్లను ఉద్దేశించి జైన్ మాట్లాడుతూ ఔరంగజేబు పేర్లతో ఉన్న రోడ్ల పేర్లను మార్చాలని పిలుపు ఇచ్చారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన కిరాతకుడు ఔరంగజేబని, హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని దుయ్యబట్టారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఔరంగాబాద్లో ఔరంగజేబు సమాధిని సందర్శించిన నేపధ్యంలో ఆగ్రా మేయర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దేశభక్తి ఉన్న ప్రజలనే భారత్లో నివసించేందుకు అనుమతించాలని అన్నారు. ఔరంగజేబు భారత్కు వ్యతిరేకమైనా ఆయన పేరుతో దేశంలో ఎన్నో ప్రదేశాలు, రోడ్లు ఉండటం దురదృష్టకరమని చెప్పారు. ఔరంగజేబు మన సంస్కృతి, సంప్రదాయాలను ధ్వంసం చేశాడని, అతడి పేరు ప్రస్తావించడం మనకు అవమానకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ఔరంగజేబు పేరుతో ఢిల్లీలో ఉన్న ఓ రోడ్డు పేరును ప్రధాని నరేంద్ర మోదీ అబ్దుల్ కలాం మార్గ్గా మార్చారని చెప్పారు. ఔరంగజేబు శిలా ఫలకాలు తొలగించి, రోడ్ల పేర్లను మార్చేందుకు మేయర్లందరూ చొరవ చూపాలని జైన్ కోరారు.