న్యూఢిల్లీ, నవంబర్ 19: ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నదన్న భయంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు తమ నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకొనేందుకు కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా కుదించుకొంటున్నాయి. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్తోపాటు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇప్పటికే వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం విదితమే. ఇప్పుడు ఈ జాబితాలో మరో దిగ్గజ టెక్ కంపెనీ సిస్కో కూడా చేరింది. నెట్వర్కింగ్ రంగంలో ఎంతో ఖ్యాతి పొందిన ఈ సంస్థ తమ మొత్తం ఉద్యోగుల్లో 5% మందిని తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు దాదాపు 83 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 4,100 మందికి ఉద్వాసన పలకాలని సిస్కో భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్ నిరాకరించారు. తమ కంపెనీ వ్యవహారాలను చక్కదిద్దుకొనేందుకు ఉద్యోగులతో మాట్లాడాలని భావిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎంత మందిని తొలగించేదీ చెప్పలేనన్నారు.
జొమాటోలో 100 మంది తొలగింపు
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సైతం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నది. మొత్తం ఉద్యోగుల్లో 3% మందిని ఇంటికి పంపిస్తున్నది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని, వివిధ విభాగాలకు చెందిన దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించామని ఆ కంపెనీ పేర్కొన్నది. పనితీరు ఆధారంగా ఏటా చేపట్టే మదింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నామని, అంతకు మించి మరేమీ లేదని జొమాటో అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రెండు వారాలపాటు కొనసాగుతుందని చెప్పారు.