న్యూఢిల్లీ, మే 1: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి తమకు ముడి పదార్థాలు అవసరం లేదని ఆమెరికా ప్రభుత్వానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పష్టం చేసింది. తాము ఉత్పత్తి చేయనున్న కొవొవ్యాక్స్కు మాత్రమే ముడి పదార్ధాలు అవసరమని తెలిపింది. దీనికి ఇంకా అనుమతి లభించాల్సి ఉందని పేర్కొంది. 2 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేయడానికి వీలుగా ఎస్ఐఐకు ముడి పదార్థాలు సరఫరా చేస్తామని ఇటీవల అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అదర్ పూనావాలా సారథ్యంలోని ఎస్ఐఐ స్పష్టతనిచ్చింది. అమెరికాను కొవొవ్యాక్స్ తయారీకి సహకరించాలని కోరితే కొవిషీల్డ్కు ముడి పదార్థాలు ఎందుకు పంపిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్ఐఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, భారత్లో వ్యాక్సిన్ల కోసం తనపై ఒత్తిడి పెరిగిపోయిందని పూనావాలా వ్యాఖ్యానించారు. మరోవైపు, కొవిషీల్డ్ ఉత్పత్తిని ఇతర దేశాల్లో ప్రారంభించాలని ఎస్ఐఐ నిర్ణయించింది. వ్యాక్సిన్ను ప్రస్తుతం పుణెలో తయారుచేస్తున్నా డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేయలేకపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై ఐజీఎస్టీ 12 శాతానికి తగ్గింపు
వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై ఐజీఎస్టీని 28 నుంచి 12 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ తగ్గింపు జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సంబంధిత సామగ్రిపై కస్టమ్ డ్యూటీని కేంద్రం గత నెలలోనే రద్దు చేసింది.