Congress G-23 Meet | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అవమానకర రీతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధినాయకత్వం గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సారధ్యంలో జీ-23 నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి డిన్నర్ సమావేశం నిర్వహించిన అసమ్మతి నేతలు 24 గంటల్లోపే తిరిగి భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్నదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. గురువారం భేటీ వరుసగా మూడవది. ఈ సమావేశానికి జర్నలిస్టులను కూడా అసమ్మతి నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తున్నది.
తాజా సమావేశం ప్రారంభం కావడానికి ముందు జీ-23 నేత భూపిందర్ సింగ్ హుడా గురువారం 12-తుగ్లక్లేన్లోని రాహుల్గాంధీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య రెండు గంటల పాటు చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. రాహుల్తో భేటీ తర్వాత బయటకు వచ్చిన హుడా.. మీడియాతో మాట్లాడకుండా.. పాత్రికేయులు వేసిన ప్రశ్నలకు స్పందించకుండా వెళ్లిపోయారు. అక్కడ నుంచి గులాం నబీ ఆజాద్ ఇంటికి చేరుకున్నారు.
బుధవారం జరిగిన భేటీలో సీనియర్ నేత శంకర్ సింగ్ వఘేలా కూడా పాల్గొన్నారు. ప్రియాంకగాంధీ వల్లే యూపీలో ఓటమి పాలయ్యామని వఘేలా ఆరోపించినట్లు తెలుస్తున్నది. బుధవారం భేటీ తర్వాత 18 మంది నేతల సంతకాలతో పత్రికా ప్రకటన విడుదల చేయడంతో అధిష్టానంతో కాంగ్రెస్ నేతలు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్లే కనిపిస్తున్నది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆమె నివాసం 10-జన్పథ్లో గులాం నబీ ఆజాద్ భేటీ కానున్నారని ఓ వార్తా సంస్థ ఒక వార్తాకథనం ప్రచురించింది. తనతో భేటీకి హాజరు కావాలని సోనియా ఆహ్వానించారని సమాచారం. సోనియాతో జరిగే భేటీలో జీ-23 నేతల ప్రతిపాదనలను ఆజాద్ వివరిస్తారని తెలుస్తున్నది. సోనియా-ఆజాద్ సంప్రదింపుల్లో రాహుల్, ప్రియాంక కూడా పాల్గొనవచ్చునని భావిస్తున్నారు. ఆజాద్తో భేటీ తర్వాత సోనియాగాంధీ మరోసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
జీ-23లో కీలకంగా ఉన్న కపిల్ సిబల్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీ కుటుంబం తప్పుకుని మరో నేతకు అప్పగించాలని సిబల్ చేసిన వ్యాఖ్యలపై గాంధీల మద్దతుదారులు దుమ్మెత్తిపోశారు. బుధవారం భేటీ తర్వాత 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు గట్టి ప్రత్యామ్నాయ కూటమి నిర్మించాల్సిన అవసరం ఉందని జీ-23 నేతలు పేర్కొన్నారు.