లక్నో: ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో పొగను గుర్తించే అలారం మోగింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని లక్నో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను కిందకు దించిన తర్వాత ఆ ఫ్లైట్ను సాంకేతికంగా తనిఖీ చేశారు. (Air India Flight) గురువారం ఉదయం 8 గంటలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అందులో 155 మంది ప్రయాణికులు ఉన్నారు.
కాగా, ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత కార్గో ఉన్న చోట పొగను గుర్తించే అలారం మోగింది. దీంతో పైలట్లు అలెర్ట్ అయ్యారు. లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ను సంప్రదించారు. ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో ఉదయం 8:52 గంటలకు ఆ విమానం లక్నో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది.
మరోవైపు విమానాశ్రయ స్పందన బృందం, అగ్నిమాపక సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఆ విమానం వద్దకు చేరుకున్నారు. అందులో ఉన్న 155 మంది ప్రయాణికులు, సిబ్బందిని కిందకు దించేశారు. ఆ తర్వాత ఆ ఫ్లైట్ను తనిఖీ కోసం హ్యాంగర్కు తరలించారు. ప్రాథమిక తనిఖీలో విమానం లోపల పొగ లేదా మంటల ఆనవాళ్లు ఏవీ కనిపించలేదని లక్నో ఎయిర్పోర్ట్ అధికార వర్గాలు తెలిపాయి. అయితే స్మోక్ అలారం మోగడానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.