న్యూఢిల్లీ: పెళ్లి విందులో భోజనం తినే ప్లేట్ల విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో క్యాటరింగ్ వ్యక్తిని డీజే బృందం కొట్టి చంపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రోహిణి ప్రాంతంలోని జపనీస్ పార్క్లో బుధవారం రాత్రి ఒక పెళ్లి వేడుక జరిగింది. హాజరైన అతిథులంతా భోజనం చేసిన తర్వాత డీజే టీమ్ సభ్యులు, క్యాటరింగ్ సిబ్బంది విందు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే భోజనం ప్లేట్లను తిరిగి వినియోగించాల్సి ఉండటంతో డీజే బృందం త్వరగా తినాలని క్యాటరింగ్ సిబ్బంది కోరారు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వారు వేచి ఉన్నారు.
కాగా, మెల్లగా తింటున్న డీజే బృందంపై క్యాటరింగ్ సిబ్బంది మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలో డీజే బృందంలోని ఒక వ్యక్తి ప్లాస్టిక్ డబ్బాతో క్యాటరింగ్ చేసే 23 ఏళ్ల సందీప్ ఠాకూర్ తలపై కొట్టాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. క్యాటరర్ హత్యకు సంబంధించి డీజే బృందానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు వారి కోసం వెతుకుతున్నారు. మృతుడు సందీప్ ఠాకూర్కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారని సోదరుడు తెలిపాడు. తమకు న్యాయం చేయాలని అతడు డిమాండ్ చేశాడు.