ముంబై: అరెస్ట్ తర్వాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలో నిర్మించిన కొత్త ఎయిర్పోర్ట్ను శనివారం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దివంగత శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆదేశాల మేరకు 1990లో తాను తొలిసారి సింధుదుర్గ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అన్నారు. తన ప్రయత్నాల వల్ల కొంకణ్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ఊపందుకున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ కోసం శివసేన ఏమీ చేయలేదని విమర్శించారు.
కాగా, ఒక్కప్పడు శివసేనకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో విమర్శలు చేశారు. ‘అబద్ధాలు చెప్పేవారంటే బాలాసాహెబ్ ఠాక్రేకి ఇష్టం ఉండదు. అలాంటి వారిని అనేక సార్లు శివసేన నుంచి తరిమికొట్టారు. చేదుగా ఉన్నా దయచేసి నిజమే చెప్పండి అని బాల్ ఠాక్రే అనే వారు’ అని ఉద్ధవ్ అన్నారు.
సింధుదుర్గ్ కోటను ప్రస్తావించిన సీఎం ఉద్ధవ్ ఛత్రపతి శివాజీ దీనిని నిర్మించారని ప్రజలకు గుర్తు చేశారు. ఈ కోటను కూడా నేనే నిర్మించానని కొందరు చెబుతారంటూ పరోక్షంగా నారాయణ్ రాణేను ఎద్దేవా చేశారు. ‘మీరు (మిస్టర్ రాణే) ఒక మంత్రి. ‘మైక్రో అండ్ స్మాల్’ మంత్రిత్వ శాఖ అయితే ఏమిటి. అది కూడా ఒక ముఖ్యమైన పోర్ట్ఫోలియో. మహారాష్ట్రకు ప్రయోజనం చేకూర్చడానికి మీరు దానిని ఉపయోగించవచ్చు’ అని ఉద్ధవ్ ఠాక్రే సూచించారు.
కాగా, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లాగి చెంపపై కొట్టేవాడినంటూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఆగస్ట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై శివసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై నాలుగు చోట్ల ఫిర్యాదులు చేశారు. దీంతో అదే నెలలో రత్నగిరి జిల్లా పోలీసులు రాణేను అరెస్ట్ చేశారు. అనారోగ్య కారణాలపై రూ.15,000 పూచికత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలీబాగ్ ఎస్పీ కార్యాలయంలో ఆగస్ట్ 30న, సెప్టెంబర్ 13న హాజరుకావాలని నారాయణ్ రాణేను కోర్టు ఆదేశించింది.
అయితే, 20 ఏండ్ల తర్వాత ఒక కేంద్ర మంత్రిని ఒక రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. నారాయణ్ రాణే వ్యాఖ్యలు, అరెస్ట్ ఘటన బీజేపీ, శివసేన మధ్య మరింత రాజకీయ వైరానికి దారి తీసింది.