అహ్మదాబాద్: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత తన భర్త గతంలో స్త్రీ అని భార్య తెలుసుకుంది. దీంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్త తనను మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. గుజరాత్లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల మహిళ తొలి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వారికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. 2014లో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా విరాజ్ వర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల సమక్షంలో అతడ్ని రెండో పెళ్లి చేసుకుంది. అనంతరం హనీమూన్ కోసం కశ్మీర్ కూడా వెళ్లారు.
అయితే ఆ జంటకు తొలి రాత్రి జరుగలేదు. భర్త విరాజ్ వర్ధన్ పలు కారణాలతో శోభనాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. ఆ మహిళ గట్టిగా నిలదీయడంతో కొన్నేళ్ల కిందట రష్యాలో రోడ్డు ప్రమాదం జరిగిందని, దీంతో శృంగారంలో పాల్గొనలేకపోతున్నట్లు చెప్పాడు. మైనర్ సర్జరీ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని భార్యకు నచ్చజెప్పాడు.
కాగా, 2020 జనవరిలో బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకుంటున్నట్లు భార్యతో చెప్పిన విరాజ్ వర్ధన్, చికిత్స కోసం కోల్కతాకు వెళ్లాడు. అనంతరం భార్యతో అసహజ పద్ధతిలో శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ మహిళ గట్టిగా నిలదీయగా అసలు వాస్తవాన్ని బయటపెట్టాడు. పుట్టుకతో స్త్రీ అయిన తాను లింగమార్పిడి చికిత్స ద్వారా పురుషుడిగా మారినట్లు తెలిపాడు. తన పేరును విజైత నుంచి విరాజ్ వర్ధన్గా మార్చుకున్నట్లు చెప్పాడు. కోల్కతాలో మగ అవయవాన్ని అమర్చే శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆమెను బెదిరించాడు.
ఈ నేపథ్యంలో ఆ మహిళ గోత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతంలో స్త్రీ అయిన భర్త, తనను మోసగించి పెళ్లి చేసుకున్నట్లు ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఢిల్లీకి చెందిన విరాజ్ వర్ధన్ను అక్కడ అదుపులోకి తీసుకుని వడోదరకు తీసుకొచ్చారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.