హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) డిమాండ్కు కేంద్ర సర్కార్ దిగి వచ్చింది. సీఏపీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల(CAPF Constable exams)ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని మంత్రి కేటీఆర్ చేసిన డిమాండ్కు కేంద్రం తలొగ్గింది. హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు 13 ఇతర ప్రాంతీయ భాషల్లో(Regional Languages)నూ ఆ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో 2024 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది.
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను మార్చి.. కానిస్టేబుల్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ కూడా గతంలో ప్రధానికి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలను కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిర్వహించి.. ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టివేస్తున్నట్లు ఇటీవల తన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కాంపిటీటివ్ పరీక్షలను కేవలం హిందీలోనే నిర్వహించడం అది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని, ఎందుకంటే దేశంలో ఎన్నో అధికార భాషలు ఉన్నాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ ప్రజల హక్కుల్ని హరిస్తోందని, రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ అవకాశాలను ఇతర ప్రాంత ప్రజలు కోల్పోతున్నట్లు కేటీఆర్ తన లేఖలో తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశంపై 2020, నవంబర్ 18వ తేదీన కేంద్రానికి లేఖ రాసినట్లు కూడా చెప్పారు.